హైదరాబాద్, డిసెంబర్ 24: ముల్కీ రూల్స్ పోరాటం నుంచి నేటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ప్రత్యేక పరిణామ ఘట్టాలపై కూడా పుస్తకం తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. జైపాల్ రెడ్డి, యాదవ రెడ్డి తెరవెనక రాజకీయం నడిపారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై తెర వెనక జరిగిన కీలక విషయాలు ప్రజలకు తెలియాలని అన్నారు. ముల్కీ, నాన్ ముల్కీ నుంచి 2014 తెలంగాణ ఉద్యమం వరకు చరిత్ర తెలియాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యాన్ని పుస్తక రూపంలో తేవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు.
యుద్ధం వద్దు – శాంతి ముద్దు అంటూ అఖిల భారత శాంతి, సహృద్భావన సంస్థ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కొంపెల్లి యాదవరెడ్డి రాసిన ’నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పుస్తకాన్ని హైదరాబాద్ రవింద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. శాంతిని కాంక్షిస్తూ 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఈ పుస్తకం రాయడం గొప్ప విషయమని సీఎం కొనియాడారు. నేటికీ వర్గాల మధ్య పోరుతో దేశంలోని కొన్ని ప్రాంతాలు అట్టుడుకిపోతున్నాయని, అలాంటి చోట శాంతి నెలకొనాలని సీఎం కాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. 2 వేల కిలోవిూటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని.. దీనిపై మాట్లాడటానికి ఎవరికీ దైర్యం లేదని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక భారత భూభాగాన్ని కోల్పోయామని అన్నారు.మణిపూర్ లో అంతర్యుద్ధం జరుగుతోందని.. రెండు దళిత జాతులు ఉచకోతలు కోసుకుంటున్నాయని అన్నారు. ఖనిజ సంపద దోచుకునేందుకే రెండు జాతుల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఈ అంశంపై భారత బలగాలు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని ప్రశ్నించారు. ఈ రెండు అంశాలపై పార్లమెంటులో లోతైన చర్చ జరగాలని అన్నారు.
భారత దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంలో కూడా శాంతి నెలకొల్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో గత ప్రభుత్వం తెలంగాణలో కొన్ని డిఫెన్స్ సంబంధించిన పరిశ్రమలకు అనుమతి ఇచ్చారని అన్నారు. సోషలిస్టు విదానంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని యాదవరెడ్డి నమ్మారని అన్నారు. పదవులకు అనుగుణంగా వారు ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదని.. తెలంగాణ ఏర్పాటుపై యాదవరెడ్డితో సోనియా చర్చించారని అన్నారు. యాదవరెడ్డి ఏనాడూ ఏ విషయాన్ని చెప్పుకోలేదని అన్నారు. శాంతి తనంతట తాను రాదని.. దానికోసం అందరం కృషి చేయాలని, క్షిపణుల కోసం కాకుండా శాంతి కోసం ఖర్చు చేయాలని యాదవరెడ్డి పిలుపునిచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రచ్ఛన్న యుద్దాలు కూడా శాంతియుతంగానే జరిగాయని అన్నారు. పార్టీలకు అతీతంగా సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, భారాస, భాజపా నేపథ్యాలున్న పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందేమోననే సంకేతాలు వస్తున్న వేళ శాంతిని కాంక్షిస్తూ ఆ పుస్తకం తేవడం ఆహ్వానించదగ్గ పరిణామమని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి దంపతులను సీఎం సత్కరించారు.