ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి
మొబైల్ యాప్లో లబ్దిదారుల పేర్లు నమోదు
గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్24: కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వేలో వేగం పెరిగిందని, ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్లో నమోదు చేసినట్లు వెల్లడిరచారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్, టోల్ ఫ్రీ నంబరు అందుబాటులోకి తీసుకొస్తామని పొంగులేటి చెప్పారు. జిల్లాకు ఒక ప్రాజెక్టు డైరెక్టర్ను నియమించినట్టు పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ నాలుగేళ్లలో 20లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామని మంత్రి పునరుద్ఘాటించారు. హిమాయత్నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి సవిూక్ష నిర్వహించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్ మెంట్ను పూర్తిగా పక్కకు పెట్టిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తప్పులు దొర్లకుండా నిజమైన ఇందిరమ్మ లబ్ది దారులను ఎంపిక చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
జిల్లాకో స్పెషల్ ఆఫీసర్ను నియమించామని గుర్తుచేశారు. మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక సర్వేపై అధికారులతో చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో 33 జిల్లాల నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19,000 మంది సిబ్బందితో యాప్ ద్వారా లబ్దిదారుల ఎంపిక పక్రియ చేపట్టినట్లు తెలిపారు. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేశారు.
దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి సర్వే పూర్తి చేసినట్లు వివరించారు. నిన్నటి వరకు 30 లక్షల పైచిలుకు అప్లికేషన్ల సర్వే పూర్తి అయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి మొదటి వారానికి పూర్తవుతుందన్నారు. లబ్దిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్ను తిరిగి బలోపేతం చేస్తున్నామని.. వివిధ విభాగాల్లో ఉన్న కార్పొరేషన్ ఉద్యోగులను 95శాతం వెనక్కి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడిరచారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడానికి అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై త్వరలో విధివిధానాలు ప్రకటించనున్నట్లు పొంగులేటి తెలిపారు.