భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అవుతుందన్న ఉద్దేశంతో ఫార్ములా-ఈ కార్ రేస్ పెట్టాలని నిర్ణయించాం అని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేస్కు ఖర్చు మెుత్తం హెచ్ఏండిఏ పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగే ఏ కార్యక్రమం అయినా హెచ్ఏండిఏ పర్యవేక్షణలో జరుగుతుందని.. హెచ్ఏండిఏ నుంచి రూ.35 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. మొత్తం ఎఫ్-1 రేస్కు రూ.150 కోట్లు ఖర్చు చేస్తే.. రూ.700 కోట్ల లాభం వచ్చిందని…ఆ రేస్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించామని.. ఎలన్మస్క్ను కూడా తీసుకురావాలని ప్రయత్నం చేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ భవన్లో కేటీఆర్ తనపై నమోదు అయిన కేసులపై మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే చిల్లర కేసులకు ఎవరు భయపడరు. న్యాయపరంగానే కొట్లాడుతాం. ఎన్ని కేసులు పెట్టాలనుకుంటున్నారో పెట్టుకోండి. ఫార్ములా-ఈరేసు కేసుతో తెలంగాణ పరువు పోతోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
దమ్ముంటే ఈ అంశంపై అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ రేసింగ్పై చర్చ పెట్టాలని మరోసారి కేటీఆర్ డిమాండ్ చేశారు. తాను తప్పు చేశానని అసెంబ్లీ సాక్షిగా నిరూపించండి. అసలు ముందు కేసు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి మీదనే. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంత్ రెడ్డే కారణం. తనపై నమోదు చేసిన కేసులో అసలు అవినీతే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఓఆర్ఆర్ టెండర్ రద్దు చేయాలి అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.