తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. కాగా ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పతకం, డైమెండ్ నెక్లెస్, వజ్రాల గాజులు, వజ్రాలు పొదిగిన కమ్మలను దాదాపు మూడు కేజీలకు పైగా రూ. 1.11 కోట్లు విలువైన నగలను అమ్మవారికి సమర్పించారు.
